ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో త్వరలోనే శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుందని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, “శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు” అంటూ దేవుని ఆశీస్సులు, పెద్దల దీవెనలతో తమ ఇంట్లో జరగబోయే శుభకార్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలాగే కాబోయే వరుడు సూర్యతేజ చిలుకూరితో జనని వివాహానికి ముందు నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఆ చిత్రాల్లో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, వియ్యంకులు కలిసి కనిపించగా, ఆ ఆనంద క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వేగంగా వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు బండ్ల గణేశ్ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బండ్ల గణేశ్ సినీ ప్రయాణం ఎంతో విభిన్నంగా సాగింది. తన కెరీర్ ప్రారంభంలో కమెడియన్గా, సహాయక నటుడిగా ఎన్నో చిత్రాల్లో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. సూర్య వంశం, సుస్వాగతం, సాంబయ్య, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా, పోకిరి, 143 వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. తరువాత నిర్మాతగా మారి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి, ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, టెంపర్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే వంటి భారీ చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా కూడా ఆయన విజయవంతమైన గుర్తింపును పొందారు.
సినిమాలతో పాటు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన బండ్ల గణేశ్, కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారునిగా కొనసాగారు. కొంతకాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమాలో తన హాస్య నటనతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే డేగల బాబ్జీ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు.
సినిమాలకు కొంత విరామం ఇచ్చినా, తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు బండ్ల గణేశ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తన కుమార్తె వివాహ శుభవార్తతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: రీల్ చేసేందుకు నదిలోకి దిగి.. నలుగురు మిత్రులు మృతి!
