క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు రూ. 105.54 కోట్ల విలువైన స్కూల్ యూనిఫాంల తయారీ ఆర్డర్ను తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసింది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా యూనిఫాంలు, దుప్పట్ల సరఫరా నేరుగా టెస్కో (TESCO) ద్వారానే జరుగుతోంది. అయితే, ఇకపై కేంద్రీకృత విధానంలో ప్రైవేటు సంస్థలకు టెండర్ల ద్వారా ఈ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనితో ఇప్పటికే వివిధ సంక్షేమ శాఖల నుండి రావాల్సిన సుమారు రూ. 200 కోట్ల విలువైన ఆర్డర్లు నిలిచిపోయి టెస్కో ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు విద్యాశాఖ కూడా ఆర్డర్ రద్దు చేయడంతో చేనేత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి ఏటా జనవరిలో ఆర్డర్లు రావడం, మే నాటికి సరఫరా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ ఈసారి విద్యాశాఖ నేరుగా ప్రైవేటు టెండర్ల వైపు మొగ్గు చూపడం గమనార్హం.
