
‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఇన్ని రోజులు భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని చెప్పుకొచ్చిన ఆయన.. తాజాగా అసలు నిజం చెప్పాడు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. భారత్-పాక్ చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
పాక్ ఆర్మీ చీఫ్ కు ట్రంప్ విందు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రంప్.. వైట్ హౌస్ లో విందు ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించడంలో తన ప్రమేయం లేదన్నారు. రెండు దేశాలు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవేళ వాళ్లు ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే అణు యుద్ధానికి దారితీసేదన్నారు. రెండు దేశాలూ అణుశక్తి కలిగిన దేశాలేనని చెప్పుకొచ్చారు. అందుకే, ఇరు దేశాలు చర్చల ద్వారా తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ
భారత్ -పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ చెప్పడం పట్ల భారత్ లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేరుగా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్ నకు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు సుమారు అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను ట్రంప్ నకు మోడీ వివరించినట్లు చెప్పారు.
Read Also: ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు.. ఇజ్రాయెల్ కు అంత ఖర్చు అవుతుందా?