India–US Trade Deal: ముందు ప్రధాని మోడీతో ఫోన్ లో ట్రంప్ చర్చలు, ఆ తర్వాతే డీల్ ఖరారు!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జరగడానికి ముందు ట్రంప్, ప్రధాని మోడీతో ఫోన్ లో చర్చలు జరిపారు. అనంతరం ఈ డీల్ ను ఓకే చేశారు.

India-US Trade Update: భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందానికి ముందు, అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీకి కాల్ చేసి కీలక చర్చలు జరిపారు. అన్ని అంశాలకు ప్రధాని మోడీ సమ్మతించిన తర్వాతే ఈ డీల్ గురించి ట్రంప్ ప్రకటన చేశారు. ముందుగా ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. తర్వాత ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.

కీలక అంశాలపై మోడీతో మాట్లాడిన ట్రంప్!

ప్రధాని మోడీతో ట్రంప్ పలు కీలక అంశాల గురించి మాట్లాడారు. ‘‘నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, శక్తివంతమైన నేత ప్రధాని మోడీతో మాట్లాడాను. వాణిజ్యం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకడం సహా చాలా అంశాలపై చర్చించాం. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు.. అమెరికా నుంచి, ముఖ్యంగా వెనెజువెలా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసేందుకు మోడీ అంగీకరించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఇది తోడ్పడుతుంది. మిత్రుడు మోడీ విజ్ఞప్తి మేరకు, ఆయనపై గౌరవంతో.. యూఎస్-భారత్‌ వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాం. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలను 25శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నాం. బదులుగా అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలను క్రమంగా సున్నాకు తగ్గిస్తుంది. వాణిజ్య అడ్డంకులను తొలగిస్తుంది” అన్నారు.

అటు “500 బిలియన్‌ డాలర్ల(రూ.45.5 లక్షల కోట్ల) విలువైన అమెరికా చమురు, బొగ్గు, సాంకేతిక, వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తుంది. దీనికి అదనంగా వీలైనంత ఎక్కువగా అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. భారత్‌ తో మా బంధం మరింత బలోపేతం అవుతుంది. ప్రధాని మోడీ, నేను ఇద్దరం గొప్ప పనులు పూర్తి చేశాం’’ అని ట్రంప్‌ ట్రూత్ లో రాసుకొచ్చారు.

మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన జైశంకర్

మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అరుదైన ఖనిజాల సరఫరాకు సంబంధించిన సమావేశంలో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button