
క్రైమ్ మిర్రర్, నల్లగొండ ఇన్వెస్టిగేషన్ బ్యూరో : యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘటన పోలీసులు, ప్రజలను విషాదంలో ముంచేసింది. రామన్నపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఉపేందర్ డ్యూటీ సమయంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. సహచర పోలీసులు సమాచారం ప్రకారం, సిరిపురం గ్రామానికి చెందిన హోంగార్డ్ ఉపేందర్ రామన్నపేట పరిధిలో వాహన తనిఖీలు చేపడుతూ విధిలో ఉన్నాడు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను చెక్ చేస్తుండగా గుర్తు తెలియని లారీ అతడి వైపు అత్యంత వేగంగా దూసుకెళ్లింది. లారీ ఢీకొట్టడంతో ఉపేందర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
తనతోపాటు విధిలో ఉన్న కానిస్టేబుళ్లు వెంటనే ప్రతిస్పందించి చిట్యాల వద్ద లారీని అడ్డుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉపేందర్కు భార్యతో పాటు ఒక ఆరేళ్ల కుమార్తె, నలుగురేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ విషాదకర ఘటనతో కుటుంబంలోనే కాకుండా జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. సహచరులు ఉపేందర్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించాడు ఆయన త్యాగం మాకు మరవలేనిది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : మా పిల్లల భవిష్యత్తును కాపాడండి..! తల్లిదండ్రులు ధర్నా
ప్రాథమిక దర్యాప్తులో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఉపేందర్ తన డ్యూటీ జోన్లో నిర్దిష్ట ప్రదేశంలో నిలిచి ఉండటమే కాకుండా, సిగ్నల్ జాకెట్టు కూడా ధరించి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన రోడ్డు భద్రతా చర్యలపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది. రాత్రి పూట వాహన తనిఖీల సమయంలో సరైన లైటింగ్, సేఫ్టీ బారియర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం ఇలాంటి ఘటనలకు దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పోలీస్ అధికారులు కూడా విధి నిర్వాహణలో భద్రతా ప్రమాణాలను పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని సహచరులు అభిప్రాయపడ్డారు. ఉపేందర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అధికారుల పర్యవేక్షణలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలు, సహచర పోలీసులు, కుటుంబ సభ్యులు ఆయనకు చివరి వీడ్కోలు పలుకుతూ కన్నీటి నివాళులు అర్పించారు.