
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి,ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాప్ కెమెరాల సహాయంతో,డ్రోన్ కెమెరాల సహాయంతో,ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని,పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. చీకటి పడే లోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు.పులి సంచారం నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





