•విధి నిర్వహణలో అపుడే తలమునకులైన కౌన్సిలర్లు…!
చండూరు,క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీ తాజా పాలకవర్గంలో కౌన్సిలర్ అంతా కొత్తవారే. అయినా అనుభవంతో పని ఉంది అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మాకుంది అంటూ అందరికంటే ముందే ఉంటూ ముందుకు సాగుతున్నారు. బుధవారం బాధ్యతలు చేపట్టారో లేదో అంతా విధి నిర్వహణలో తలమునకలయ్యారు. బాధ్యతలు చేపట్టిన రోజే మూడు గంటల పాటు పెండింగ్ పనులు… చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి అందర్నీ అబ్బురపరిచారు. కౌన్సిలర్లు అందరూ నిత్యం తమ వాడల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అతి త్వరలో మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టి నిత్యం వార్డుల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక శనివారం నాడు దోమల మందు పిచికారిని నూతన మున్సిపాలిటీ పాలకవర్గం ప్రారంభించింది. చండూరు మున్సిపాలిటీలో దోమల బెడదను అరికట్టేందుకు, అన్ని వార్డులలో దోమల మందు పిచికారి చేయుటకు నిర్ణయించి నూతన మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని వార్డులలో ప్రజలు మురుగు కాలువలను సక్రమంగా వినియోగించుకోవాలని, ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలని, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు. ప్రజలు గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు, నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్ షేడ్ లు, కూలర్లలో నిల్వ ఉన్న నీళ్లు తీసి వేయడంతో నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోడి సుష్మ వెంకన్న, తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, జిల్లా ధనమ్మ శ్రీనివాసులు, సాయిరాం,అరవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

