ఖమ్మం జిల్లాలోని బోనకల్లు మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ బాలికల గురుకుల కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని అధ్యాపకురాలు దూషించిందనే మనస్తాపంతో కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమాచారం ప్రకారం.. క్లాస్లో అధ్యాపకురాలు తిట్టడంతో విద్యార్థినిని తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. ఆవేదనను తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సహ విద్యార్థులు చెబుతున్నారు.
ఈ ఘటనను గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాలికను అత్యవసరంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో బాలిక పరిస్థితి కోలుకుంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకురాలిని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి నాగ వెంకట్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం గుంటూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూ కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడని ఆశించిన కుమారుడు అకస్మాత్తుగా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కష్టపడి చదివి జీవితంలో ముందుకు సాగుతాడని భావించిన తనయుడు శవంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే జిల్లాలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు ప్రజలను తీవ్రంగా కలచివేశాయి.
ALSO READ: ఆధార్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. త్వరలో పూర్తిగా మారనున్న డిజైన్
