
క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకతలకు దారితీస్తోంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన పలు నిరుపేద కుటుంబాలు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని గళం ఎత్తుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో నాయకుల కక్షసాధింపులు పెచ్చులూడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బాధితులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అడుగుల రాములు, బత్తుల రాము మాట్లాడుతూ గత పదేళ్లుగా గ్రామంలో సొంత ఇల్లు లేక కిరాయికి ఉండే పరిస్థితి వచ్చింది. గ్రామంలో కూడ కిరాయి ఇల్లు దొరకక పక్క గ్రామాల్లో జీవనం సాగించాల్సిన దుస్థితి ఎదురైంది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మా పేర్లు లేవు. ఇండ్లు లేని వారికి మొదటి అవకాశం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం చాలా బాధాకరం అని వాపోయారు.
ఇల్లు కూలిపోవడంతో గత ఐదు సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్న బత్తుల రాము “ఇందిరమ్మ ఇళ్లకు అర్హుడిని అయినా నాకు ఇల్లు కేటాయించలేదు. కొంతమంది నాయకులు తమ స్వార్థంతో నన్ను జాబితా నుంచి తొలగించారు” అని కన్నీటి గళంతో అన్నారు.
కల నెరవేరుతుందేమో అనుకుంటే… కలలు కలలుగానే మిగిలాయి…
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే చెప్పినా, గ్రామస్థాయి నాయకుల ప్రవర్తన విరుద్ధంగా ఉందని బాధితులు వాపోతున్నారు. నిజమైన లబ్ధిదారులైన అయితపాక పద్మ, కలకొండ సుజాతలతో పాటు గ్రామంలో ఉన్న పలు అర్హుల పేర్లు జాబితాలో చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసి అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.