Thursday, February 19, 2026
HomeతెలంగాణTelangana: సీఎస్ పదవిపై ఉత్కంఠభరిత పరిణామాలు

Telangana: సీఎస్ పదవిపై ఉత్కంఠభరిత పరిణామాలు

Telangana: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారనే అంశంపై సెక్రటేరియట్ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ఇప్పటికే ఒకసారి పదవీ విరమణ అనంతరం ఆయనకు కేంద్రం నుంచి 7 నెలల పొడిగింపు లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక కొత్త అధికారిని నియమిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

రామకృష్ణారావు గత ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ, పరిపాలన అనుభవం, కేంద్ర స్థాయి పరిచయాలు దృష్ట్యా ఆయనకు కేంద్రం ప్రత్యేకంగా పొడిగింపు మంజూరు చేసింది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం పెంపు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, కేంద్ర అనుమతుల వేగవంతం వంటి అంశాల్లో ఆయన చూపిన చురుకుదనం ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తే పరిపాలనలో స్థిరత్వం కొనసాగుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అధికారిని తీసుకురావడం కంటే అనుభవజ్ఞుడైన రామకృష్ణారావును కొనసాగించడం మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం రాష్ట్రానికి అనుకూలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రతిపాదనల ఆమోదంలో వేగం పెరిగిందనే చర్చ ఉంది. అయితే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సానుకూలతపై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా, సీఎస్ పదవిని లక్ష్యంగా చేసుకుని సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు రామకృష్ణారావు పదవీకాలాన్ని మరింత పొడగించవద్దని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మరికొందరు తమకే అవకాశం ఇవ్వాలని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న జయేశ్ రంజన్, సభ్యసాచి ఘోష్, వికాస్ రాజ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలను కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ప్రస్తుతం సెంట్రల్ సర్వీస్‌లో కొనసాగుతున్న సంజయ్ జాజు కూడా ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనలో కీలకమైన సీఎస్ పదవిపై తుది నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్రం నుంచి వచ్చే సంకేతాలపై ఆధారపడి తదుపరి పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది.

ALSO READ: Valentines Day Trend: గులాబీల కంటే కండోమ్స్‌కే క్రేజ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments