
హోటల్ రంగంలో సంచలనంగా మారిన ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇక పై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది ఓయో. ఈమేరకు తన చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది ఓయో యాజమాన్యం.
ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్స్ అడగనుంది ఓయో. సరైన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్లోని ఓయో భాగస్వామి హోటల్స్లో చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్ని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది.
అసాంఘిక కార్యకలాపాలకు, అక్రమ సంబంధాలకు ఓయో రూమ్స్ కేంద్రంగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓయో రూమ్స్ వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాలేజీ విద్యార్థులు కూడా ఓయో రూమ్స్ వల్ల చెడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఓయో హోటల్స్ ను బ్యాన్ చేయాలని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది.