తెలంగాణ

సినిమా చూపిస్త బిడ్డా.. సీఎం రేవంత్‌కు కవిత మాస్ వార్నింగ్

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుంటే తాము ఎన్నికలు జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడంపై ఆలోచన చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

దాదాపు 40కిపైగా బీసీ కుల సంఘాలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చే కార్యచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని, రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వబోమని కవిత ప్రకటించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవిత హెచ్చరించారు. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాకా, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ఆలోచన చేయాలని, అంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే… జనవరి 3న సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. జనవరి 3 నాటి సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొల్ల శివశంకర్, సుమిత్ర ఆనంద్, మఠం భిక్షపతి, అనంతుల ప్రశాంత్ సహా పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.

Back to top button