
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్కు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే బొల్లు మల్లవ్వ (60) అనే వృద్ధ మహిళను గుర్తుతెలియని దుండగుడు అతి కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మల్లవ్వ తన వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, ప్రధాన రహదారిపై ఆమెపై దాడి జరిగింది. పదునైన ఆయుధంతో మెడపై తీవ్రంగా గాయపరిచి అక్కడికక్కడే హతమార్చినట్టు సమాచారం.
ఘటన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణంగా భూ తగాదాలే ప్రాథమికంగా ఉన్నట్టు స్థానికుల వాదన. మృతురాలు మల్లవ్వకు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా భూ వివాదం ముదిరినట్లు సమాచారం.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ హత్య పోలీస్ స్టేషన్ దూరంలోనే జరగడం, అది కూడా పగలు పూట జరగడం చుట్టుపక్కల భయాందోళనలు కలిగించింది. గ్రామస్తులు సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.