
హైదరాబాద్ లో రెండు రోజుల పాటు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసే ప్రాంతాల లిస్ట్ విడుదల చేసిన పోలీసులు.. ఆ మార్గాల్లో వచ్చే వారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు పాటు ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి రాజ్భవన్కు చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. శుక్రవారం శిల్పకళా వేదికలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు రాష్ట్రపతి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో హైదరాబాద్లో గురు, శుక్రవారాలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్ ల్యాండ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, పీపీఎన్టీ ఫ్లైఓవర్, హెచ్పీఎస్ ఔట్గేట్, ఎయిర్పోర్టు వై.జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియ హోటల్, మెట్రో రెసిడెన్సీ, పీవీ విగ్రహం, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, కట్టమైసమ్మ, ఇక్బాల్ మినార్, ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, అశోక్నగర్ జంక్షన్, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాదాపూర్, రాయదుర్గం, కొత్తగూడ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మాదాపూర్ లో జరిగే లోక్ మంథన్ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు