క్రైమ్తెలంగాణ

ఫుడ్‌ బదులు డ్రగ్స్‌ సప్లయ్‌ - అది కూడా హైదరాబాద్‌లోని ఓ దాబాలో..!

సాధారణంగా దాబాలో ఏం ఉంటుంది. ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, నార్త్‌ స్పెషల్‌ డిషెస్‌ ఇవే కదా. కానీ ఆ దాబాలో మాత్రం అంతా దందానే. అక్కడ ఫుడ్‌ దొరకదు. కానీ డ్రగ్స్‌ మాత్రం విచ్చలవిడిగా దొరుకుతాయి. ఆ దాబాకు వెళ్లే వారిలో ఎక్కువ మంది డ్రగ్స్‌ కోసమే వెళ్తారు. దాబా ముసుగులో జరుగుతున్న ఈ డ్రగ్స్‌ దందా ఎక్కడో తెలుసా. ఇంకెక్కడ మన హైదరాబాద్‌లోనే. ఏది కావాలన్నా దొరికే హైదరాబాద్‌లో.. డ్రగ్స్‌ దందా కూడా దర్జానే సాగుతోంది.

హైదరాబాద్‌ షాద్‌నగర్‌లోని సంజు భాయ్‌ మార్వాడీ దాబాలో డ్రగ్స్‌ దందా జరుగుతోంది. వంట మనిషిగా ఉన్న వికాస్‌ సాహు… దాబాకు వచ్చే వారికి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ విక్రయిస్తున్నాడు. ఫుడ్‌తోపాటు డ్రగ్స్‌ కూడా సరఫరా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే…. ఫుడ్‌ కోసం కాదు.. డ్రగ్స్‌ కావాలనుకునే వారే.. ఈ దాబాకు ఎక్కువగా వస్తుంటారని సమాచారం. ఈ దాబాలో జరుగుతున్న దందాపై నిఘా పెట్టిన పోలీసులు… డ్రగ్స్‌ దందా జరుగుతున్నట్టు గుర్తించారు. ఆకస్మికంగా తనిఖీ చేశారు… డ్రగ్స్‌ సప్లై చేస్తున్న వంట మనిషిగా వికాస్‌ సాహును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నించగా… దాబా ముసుగులో ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న డ్రగ్స్‌ దందా బయటపడింది. దాబాలో సోదాలు చేసిన పోలీసులు… ఒకటిన్న కేజీల హెరాయిన్‌, కేజీ గంజాయి, 680 గ్రాముల ఓపీఎం డ్రగ్స్‌, రెండున్న కేజీల పప్పి స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు.

వికాస్‌ సాహు.. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌ వచ్చిన దాబాలో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆ దాబా ఓనర్‌ సంజు భాయ్‌. ఇతనే.. వికాస్‌ సాహును హైదరాబాద్‌ పిలిపించుకుని.. దాబాలో వంటమనిషిగా పెట్టారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఉంది. దాబా ఓనర్‌ సంజు భాయ్‌, వికాస్‌ సాహు.. ఇద్దరిపై 2022లో డ్రగ్స్‌ కేసులు ఉన్నాయి. కొంత కాలం జైల్లో ఉండి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. ఏప్రిల్‌లో దాబా ఓనర్‌ సంజు భాయ్‌ చనిపోయాడు. దీంతో.. దాబాను వికాస్‌ సాహునే చూసుకుంటున్నాడు. డ్రగ్స్‌ దందా కూడా కొనసాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. సీజ్‌ చేసిన డ్రగ్స్‌ విలువ రూ.3.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వికాస్‌ సాహును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతనితోపాటు ఇంకా ఈ ముఠాలో ఎంత మంది ఉన్నారు.. అనే వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. వికాస్‌ కాల్‌ డేటాను చెక్‌ చేస్తున్నారు. వికాస్‌కు మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్‌ ముఠాలతోనూ లింకులు ఉన్నట్టు చెప్తున్నారు పోలీసులు. ఈ ముఠాలోని ముగ్గురిని గుర్తించారు. వాళ్లు దూల్‌పేట్‌కు చెందిన సలీమ్‌, మహేశ్వరంలోని రాజు, మధ్యప్రదేశ్‌కు చెందిన గణ్‌పథ్‌ అని… ఈ ముగ్గురు పెడ్లర్స్‌ కమ్‌ సప్లయర్స్‌ అని చెప్తున్నారు. ప్రస్తుతం ముగ్గురూ పరారీలో ఉన్నారు. ఇక… దాబాకు వచ్చే కస్టమర్లకు మాత్రమే డ్రగ్స్‌ అమ్ముతున్నాడు సాహు. ఆ కస్టమర్లు ఎవరు.. అన్నది కూడా ఆరా తీస్తున్నారు. బయటకు వారికి కూడా అమ్మారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button