
Sonia Gandhi Slams India: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. గాజా, ఇరాన్ లో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తున్నా, భారత్ మౌనంగా ఉండటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ దాడుల గురించి మాట్లాడకపోవడం అంటే గొంతుక కోల్పోవడమే కాదు, విలువలను కూడా విస్మరించినట్లు అవుతుందన్నారు. ఈ మేరకు ఆమె ఓ జాతీయ పత్రికకు వ్యాసం రాశారు.
ఇప్పటికీ సమయం మించిపోలేదన్న సోనియా
సోనియా తన వ్యాసంలో కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదని వెల్లడించింది. భారత్ ఇప్పటికైనా తన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ స్పష్టంగా మాట్లాడ్డంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల కోసం అందుబాటులో ఉన్న ప్రతీ దౌత్య మార్గాన్ని వాడాల్సిన అవసరం ఉందని సోనియా సూచించారు. స్వతంత్ర పాలస్తీనాకు సంబంధించి భారత కట్టుబాటును ఎన్డీయే ప్రభుత్వం వదిలేసిందని ఆమె విమర్శించారు.
ట్రంప్ తీరును తప్పుబట్టిన సోనియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార తీరుపైనా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడిన ట్రంప్.. పశ్చిమాసియాలో మాత్రం విధ్వంసకర విధానాన్ని అవలంభిస్తుందని విమర్శించారు. ఇరాన్- అమెరికా మధ్య అణు చర్చలకు మార్గం సుగమం అవుతున్న సమయంలో.. ఇజ్రాయెల్ టెహ్రాన్ లోని అణుస్థావరాలపై దాడులకు దిగడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుమణిగేలా చేయాలని సోనియా సూచించారు. అటు ముస్లీం ఓట్ల కోసమే సోనియా ఈ అంశాన్ని లేవనెత్తారని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: ట్రంప్ మొదలుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!