
-
చండూరు ఎస్సై వెంకన్నపై తీవ్ర ఆరోపణలు
-
బాధిత కుటుంబం చర్యల కోసం పట్టుబట్టి పోరాటం
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : సివిల్ సమస్యగా చర్చించాల్సిన అంశాన్ని పోలీసులు బలప్రయోగానికి దారితీయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చండూరు ఎస్సై వెంకన్నపై ఇటువంటి ఆరోపణలే వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే… తాస్కాని గూడెం గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఇది న్యాయపరంగా పరిష్కరించాల్సిన అంశం అయినప్పటికీ, చండూరు ఎస్సై వెంకన్న మద్యలో జోక్యం చేసుకొని ఓ వర్గం… పక్షాన మిగతా వర్గాన్ని వేధించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, బాధితుడిని స్టేషన్కు పిలిపించి తీవ్రంగా దూషించడంతో పాటు, శారీరకంగా కూడా దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి ఎస్సై వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : సోషల్ మీడియా పరిచయం… మహిళా దారుణ హత్య? ఎక్కడంటే!
ఈ ఘటనపై బాధిత కుటుంబం, గ్రామస్థులు స్పందిస్తూ… ఇది పూర్తిగా సివిల్ మ్యాటర్. అయినప్పటికీ ఎస్సై వెంకన్న ఒక వర్గానికే మద్దతుగా వ్యవహరిస్తూ మమ్మల్ని వేధిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, బాధ్యత వహించిన ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ నుంచి స్పందన రానప్పటికీ, స్థానికంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా వ్యక్తిగతంగా వ్యవహరిస్తే, సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.