అమెరికా ప్రభుత్వం ప్రపంచ దేశాలపై విధించిన వాణిజ్య సుంకాల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ సర్కార్ అమలు చేసిన వాణిజ్య ఒప్పందాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్- అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో కొత్త మలుపు తిరిగింది. గతంలో భారత్పై విధించిన 25 శాతం సుంకాలను మొదట 18 శాతానికి తగ్గించిన అమెరికా, తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని మరింతగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్పై అమలులో ఉన్న 18 శాతం సుంకాలను ఇప్పుడు 10 శాతానికి పరిమితం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది.
ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా జారీ అయ్యాయి. తగ్గించిన సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. ఈ సవరణ 150 రోజులపాటు అమలులో ఉండనుంది. ఫిబ్రవరి 24 నుంచి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం మాత్రమే విధించబడుతుంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అయితే ఔషధ రంగానికి ఈ సుంకం వర్తించదని స్పష్టం చేశారు. అలాగే అమెరికా- మెక్సికో- కెనడా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద పరిధిలో వచ్చే వస్తువులకు కూడా ఈ సుంకం నుంచి మినహాయింపు కల్పించారు.
అమెరికా అధ్యక్ష భవనం ప్రకటన ప్రకారం.. అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతర దేశాలకు కూడా ఇదే 10 శాతం సుంకం వర్తించనుంది. గతంలో అమలులో ఉన్న అధిక సుంకాలు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతానికి ఒకే విధమైన రేటు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, భవిష్యత్తులో ముందుగా చర్చల ద్వారా నిర్ణయించిన రేట్లను తిరిగి అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ పరిణామం భారత్కు తాత్కాలిక ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ఎగుమతిదారులకు ఇది కొంత ఉపశమనంగా మారనుంది. ముఖ్యంగా తయారీ, లోహ, యంత్రసామగ్రి రంగాలకు ఈ సుంకాల తగ్గింపు ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే భవిష్యత్తులో మళ్లీ సుంకాల పెంపు అంశం తెరపైకి వచ్చే అవకాశాన్ని కూడా కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అందువల్ల దీర్ఘకాలిక వ్యూహాలపై భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: ‘నిన్ను మీ నాన్నే రే.. చేసి ఉంటాడు’.. నెటిజన్ కామెంట్కు చిన్మయి కౌంటర్
