
Bastar Railway Line: నక్సల్ ప్రభావిత ప్రాంతమైన చత్తీస్ గఢ్ బస్తర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే బస్తర్ ప్రాంతంలో రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు కొనసాగించేలా చర్యలు చేపడుతోంది. తెలంగాణలోని కొత్తగూడెం, చత్తీస్ గఢ్ లోని కిరందుల్ ను కలుపుతూ 160 కిలో మీటర్ల మేర రైల్వే నిర్మాణానికి లొకేషన్ సర్వే జరుపగుతోంది. త్వరలోనే ఈ సర్వే పూర్తి కానుంది. తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైను ఎక్కువగా చత్తీస్ గఢ్ ప్రాంతంలోనే ఉంటుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 138 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. నక్స్ ల్ ప్రభావిత బస్తర్ డివిజన్ లోని సుక్మా, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల మీదుగా ఈ రైల్వే లైన్ కొనసాగనుంది.
ఈ రైల్వే లైన్ తో లాభాలేంటి?
చత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతం పూర్తిగా ఆదివాసీలతో ఉంటుంది. నగర జీవితానికి ఈ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే, ఆదివాసీ, గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. అత్యాధునిక లైడార్ టెక్నాలజీతో ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. సర్వే కంప్లీట్ అయిన తర్వాత రైల్వే విభాగం.. డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తుంది. దానికి ఆమోదం లభించిన వెంటనే రైల్వే లైన్ నిర్మాణ పనులు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అన్ని పనులు చకచకా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ఇక బైకులకూ టోల్ ఛార్జీ.. నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?