* రాష్ట్రపతికి ఏపీ నుంచి ఫిర్యాదులు
* రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ..
* ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ లేఖ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలింది. ఆయనపై రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారని.. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ ప్రతినిధి సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు రాష్ట్రపతి కార్యాలయానికి. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్ ప్రాథమిక విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు లేఖ రాసింది. అయితే ఈ ఫిర్యాదు వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణం రాజు ఎక్కువగా కామెంట్స్ చేసేది ఆ పార్టీ పైనే.
రాజకీయాలు మాట్లాడుతున్నారని..
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండేవారు రాజకీయాల కోసం మాట్లాడకూడదు. ఇది నిబంధన కూడా. రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనపై ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో స్పీకర్ గా ఉండే తమ్మినేని సీతారాం అయితే రాజకీయ విమర్శలు నిత్యం చేసేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేసేవారు. తాను ముందుగా ఒక ఎమ్మెల్యే నని.. తరువాతే స్పీకర్ అన్న విషయాలను గుర్తు చేసుకోవాలని పదేపదే చెప్పుకొచ్చేవారు తమ్మినేని. శాసన వ్యవస్థ పై న్యాయవ్యవస్థ పెత్తనం ఏంటని కూడా అప్పట్లో ప్రశ్నించారు తమ్మినేని. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు కేవలం విధానపరమైనవి మాత్రమే. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం లేదు రఘురామకృష్ణంరాజు. కేవలం సమకాలీన అంశాలపై మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. అయినా సరే ఆయనపై ఫిర్యాదు వెళ్లడంతో రాష్ట్రపతి భవన్ స్పందించింది.
వైసీపీకి ఇబ్బంది..
రఘురామకృష్ణం రాజు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు సెటైరికల్ గా ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంటూ భంగపడ్డారు రఘురామకృష్ణం రాజు. అందుకే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చేసారు. చంద్రబాబు గుర్తించి రఘురామకృష్ణం రాజుకు ఉండి శాసనసభ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. స్పీకర్ పదవి కూడా ఇస్తారని టాక్ నడిచింది. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టారు. అయినా ఆ పదవిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు. నేరుగా రాజకీయ విమర్శలు చేయకుండా.. పూర్తిగా సెటైరికల్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇటీవల ఉండి నియోజకవర్గంలో రామాలయంలో జరిగిన వివాదం పెను దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే రెండోసారి ఆయనపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. అయితే తొలిసారి రాష్ట్రపతి పవన్ పట్టించుకోలేదు కానీ.. రెండోసారి ఫిర్యాదు వచ్చేసరికి మాత్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి లేఖ రాసింది రాష్ట్రపతి భవన్. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి..
