- రాహుల్ తో భారత్ జోడో యాత్ర
- ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం
- రాహుల్ అనుచరల దుర్మార్గం అంటూ ఫోటో విడుదల చేసిన బీజేపీ
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేయడం, చొక్కాలు విప్పి నిరసన తెలపడం ఆ పార్టీని వివాదంలోకి నెట్టింది. ప్రధానమంత్రి మోడీ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంటూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. అయితే ఈ చర్యను కేంద్ర మంత్రులతో సహా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో రాహుల్తో కనిపించిన వ్యక్తే ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసినట్టు బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు.
పక్కా ప్లాన్ ప్రకారమే నిరసన
ఏఐ సమ్మిట్లో నగ్న ప్రదర్శన నిర్వహించిన వారిలో నర్సింహ యాదవ్ అనే వ్యక్తి రాహుల్తో ఉండటాన్ని అమిత్ మాలవీయ ప్రస్తావిస్తూ, ఏఐ సమ్మిట్ ఘటన యాదృచ్ఛికంగా జరిగింది కాదనీ, ముందస్తు ప్లాన్తో జరిగిందేనన్నారు. టెక్నాలజీలో నాయకత్వం, ఇన్నొవేషన్కు పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఐ సమ్మిట్కు భారత్ అతిథ్యం ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అప్రతిష్టపాలు చేయాలనుకుంటోందని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ ప్రపంచం ముందు భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉండకూడదని అన్నారు.
నలుగురు వ్యక్తులను గుర్తించిన పోలీసులు
ఏఐ సదస్సులో నిరసనకు దిగిన నలుగురిని అరెస్టు చేసినట్టు ఘటన అనంతరం పోలీసులు తెలిపారు. వీరిని పాటియాలా హౌస్ కోర్టు ముందుకు హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగిందని, నిరసనకు దిగిన వ్యక్తులు సమ్మట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని, క్యూఆర్ కోడ్ ద్వారా లోపలకు ప్రవేశించారని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ మహ్లా తెలిపారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తుల్లో ఒకరిని బిహార్కు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ హరి, రెండో వ్యక్తిని బీహార్కే చెందిన కుందన్ యాదన్, మూడో వ్యక్తిని అజయ్ కుమార్, నాలుగో వ్యక్తిని నర్సింహ యాదవ్గా గుర్తించారు. ఇండియన్ యాత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్గా నర్సింహ యాదవ్ వ్యవహరిస్తున్నారు.
Read Also: ఉచితాలు ఎంతకాలం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు!
