క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ప్రతి రోజూ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని నల్లగొండ 9వ డివిజన్ నుంచి విజయం సాధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి భాణావత్ దీప్లానాయక్ అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనను మంచి మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తన పదవీ కాలంలో డివిజన్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసని.. నాలుగు దశాబ్దాలుగా 9వ డివిజన్ లో ఉన్న తనకు ఇక్కడి సమస్యలపైనా పూర్తి అవగాహన ఉందని దీప్లా నాయక్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా, మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని 9వ డివిజన్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించబోయేది బీఆర్ఎస్ అని చెప్పిన ఆయన, తనను గెలిపించిన డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఎన్నికల తర్వాత డిడిజన్ అభివృద్ధి మీద ఫోకస్ పెడతానని చెప్పారు. డివిజన్ కు సంబంధించి ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇంట్లో కుటుంబ సభ్యుడిలా తాను పరిష్కరిస్తానని దీప్లా నాయక్ హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో 9వ వార్డు కార్పొరేటర్ గా నిలబడేందుకు అవకాశం కల్పించిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి దీప్లా నాయక్ ధన్యవాదాలు చెప్పారు. తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన బీఆర్ఎస్ నాయకులు వజ్జ శ్రీనివాస్ యాదవ్, భాణావత్ భాస్కర్, కుంకుట్ల శంకర్, కన్నెబోయిన రమేష్, కందుల నరేందర్, చిన్నాల ఆంజనేయులు, మన్నెం రాములు, నీలకంఠం నాగార్జున, సుధాకర్, శివతో సహా ఇతర నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.
