రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి లేకపోయినా, పరిస్థితులు కలిసివస్తే మహిళలు ప్రజాక్షేత్రంలో ఎలా ముందుకు వస్తారో తెలంగాణ రాజకీయ పరిణామాలు మరోసారి స్పష్టంచేశాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త నాయకత్వానికి దారితీశాయి. ముఖ్యంగా మహిళలకు లభించిన అవకాశాలు అనేక కుటుంబాల్లో కొత్త చరిత్రను సృష్టించాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు వేర్వేరు స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పాలన పగ్గాలు చేపట్టడం అరుదైన ఘటనగా నిలిచింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు తల్లీకూతుళ్లు ఒకేసారి ప్రజాపాలనలో కీలక బాధ్యతలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణలో తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాలకు కొత్త ఊపునిచ్చాయి. ఆ వెంటనే జరిగిన మున్సిపల్ ఎన్నికలు పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. చాలా చోట్ల మహిళలు స్వయంగా ముందుకొచ్చి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి విజయగాథలలో యాదాద్రి జిల్లాకు చెందిన జనంపల్లి గ్రామం ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఈ గ్రామానికి చెందిన కుటుంబంలో తల్లి గ్రామ సర్పంచ్గా, కూతురు జిల్లా కేంద్రంలోని నగర మేయర్గా ఎన్నికవడం విశేషం.
జనంపల్లికి చెందిన బండ అంజిరెడ్డి రాజకీయాలపై ఎప్పటినుంచో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఆయన గ్రామ సర్పంచ్ పదవికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో సాధించలేని విజయాన్ని రెండు దశాబ్దాల తర్వాత వారి కుటుంబం అందుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి సరోజ గ్రామ సర్పంచ్ పదవికి పోటీచేసి గెలుపొందారు. ప్రజల మద్దతుతో గ్రామ మొదటి పౌరురాలిగా బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై దృష్టిసారిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే కుటుంబానికి చెందిన పెద్ద కూతురు చైతన్య రెడ్డి కూడా ప్రజాసేవా మార్గాన్నే ఎంచుకున్నారు. సుమారు 23 సంవత్సరాల క్రితం నల్గొండకు చెందిన బుర్రి శ్రీనివాస్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రాజకీయ పరిజ్ఞానం పెంపొందించుకున్నారు. గతంలో ఆలయ కమిటీ అధ్యక్షురాలిగా, అనంతరం కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహించి ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇటీవల జరిగిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా విజయం సాధించి మరో అడుగు ముందుకేశారు.
ఈ నేపథ్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడం కీలక మలుపుగా మారింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చైతన్య రెడ్డి మేయర్ పీఠాన్ని అధిష్టించారు. కౌన్సిలర్గా ఉన్న సమయంలో కుటుంబ సహకారం ఉన్నప్పటికీ, ఇప్పుడు స్వతంత్రంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి పట్టణాభివృద్ధి దిశగా కార్యాచరణ ప్రారంభించారు. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, రహదారుల మెరుగుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు.
ఇలా ఒకే కుటుంబంలో తల్లి గ్రామ సర్పంచ్గా, కూతురు నగర మేయర్గా కొనసాగడం స్థానిక రాజకీయాల్లో కొత్త చరిత్రగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన ఆడపడుచు జిల్లా కేంద్ర మేయర్గా ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు గర్వభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ముందుకు వస్తే సమాజ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందనే నమ్మకాన్ని ఈ ఘటన బలపరుస్తోంది. కుటుంబ ప్రోత్సాహం, ప్రజల మద్దతు, అవకాశాల వినియోగం కలిసివస్తే మహిళలు ఏ స్థాయికైనా చేరగలరని ఈ తల్లీకూతుళ్ల విజయగాథ స్పష్టం చేస్తోంది.
ALSO READ: దారుణం.. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆపై!
