
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : రోడ్డున పోయే వారిపై డబ్బుల వర్షం కురిసింది. ఇంటి బాల్కనీలోని కిటికీలో నుంచి నోట్ల కట్టలు.. కింద పడ్డాయి. చూస్తే అన్నీ 500 రూపాయల నోట్లే… అన్నీ ఒరిజనలే. అది చూసి.. స్థానికులంతా నివ్వెరపోయారు. భళే ఛాన్సులే అనుకున్నారు. కట్ చేస్తే… ఒక్క రూపాయలు కూడా వారికి అందలేదు. అన్నీ.. అధికారులు పట్టుకెళ్లారు. ఏంటి.. అంతా కన్ఫ్యూజన్గా ఉందా..? అసలు ఏం జరిగిందంటే…!
ఇది.. ఒడిశాలోని ఓ అవినీతి అధికారి బాగోతం. భువనేశ్వర్లో గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వైకుంఠనాథ్ సారంగి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడని అతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు అతని ఇంట్లో సోదాలు చేయాలని భావించారు. అధికారులు తన ఇంటికి వస్తున్నారని తెలిసి… కంగారు పడ్డాడు ఆ అధికారి. అక్రమ సంపాదన మొత్తం అధికారులకు అప్పగించలేక… ఇంటి బాల్కనీలోని కిటికీలో నుంచి నోట్ల కట్టలను విసిరేశాడు. కిటికీలో నుంచి డబ్బులు పడటంతో… స్థానికులు ఆశ్చర్యపోయారు. వీడియోలు కూడా తీశారు. అంతలోనే అధికారులు వచ్చారు. కిటికీలో నుంచి పడేసిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత… వైకుంఠనాథ్ సారంగి ఇంట్లో కూడా రైడ్స్ చేశారు. వెతుకున్న కొద్దీ డబ్బు కట్టలు బయటపడటంతో.. అధికారులు నోరెళ్లబెట్టారు.
వైకుంఠనాథ్ సారంగికి చెందిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు విజిలెన్స్ అధికారులు. రెండు ఇళ్లలో రెండున్న కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా గుర్తించారు. సారంగి ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలను లెక్కబెట్టేందుకు అధికారులు… గంటకుపైగా సమయం పట్టింది. ఈ సోదాల్లో పాల్గొన్న వారిలో 8 మంది డిప్యూటీ సూపరిటెండెంట్ ఆప్ పోలీసులు, 12 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 26 మంది అధికారులు ఉన్నారు. అధికారులు తన ఇంటికి రావడం చూసి.. డబ్బును కిటికీలో నుంచి బయటకు పడేశాడు సారంగి. కానీ.. ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. ఆ సీన్ను అధికారులు గమనించారు. ప్రజల సమక్షంలోనే ఆ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ సారంగిని అదుపులోకి తీసుకున్నారు.