
గోదావరి జలాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వృధా అవుతున్న గోదావరి నీటిని మన పొలాలకు మళ్లించుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉండేదన్నారు. తుపాలకులగూడెం వద్ద నుంచే నదుల అనుసంధాన లింకేజ్ పాయింట్ ఉండాలని కేసీఆర్ వాదించారని..దీని వల్ల తెలంగాణలోని 6 జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని కవిత వెల్లడించారు. పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ ప్రతిపాదిస్తే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తెలివిగా గోదావరి - పెన్నా అనుసంధానమని చెప్పి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారని కవిత అన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పా కనీసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం లేదని విమర్శించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లాలూచి ఏమిటో చెప్పాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పీఎఫ్ఆర్ సమర్పించినా సీఎం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని.. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదని నిమ్మల రామా నాయుడు చెప్పడం సరికాదన్నారు. గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశారని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు సుప్రీంకోర్డులో కూడా పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు.సుంకేశుల సామర్థ్యాన్ని పెంచుకున్న చంద్రబాబు తుమ్మిళ్ల సామర్థ్యాన్ని పెంచుకొనివ్వలేదని గుర్తు చేశారు.
నల్లమల పులిని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. జలదోపిడిని నివారించే విషయంలో పేపర్ టైగర్ గా మిగిలిపోయారని కవిత విమర్శించారు. బొల్లపల్లిలో 150 టీఎంసీ సామర్థ్యంలో నిర్మించే రిజర్వాయర్ వల్ల నల్లమల అడవీ మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తెలంగాణ జాగృతి తరఫున కోర్డులను ఆశ్రయిస్తామన్నారు. ముఖ్యమంత్రికి సవాలు చేస్తున్నా… మీరు నిజంగా నల్లమల పులి బిడ్డ అయితే బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండని సవాల్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదని నిలదీశారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేయాలన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని లేఖలు రాసినా ప్రాజెక్టు ఆగదన్నారు. ప్రాజెక్టు ఆగాలంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం లొల్లి పెట్టాలన్నారు.