MLA Kaushik Reddy: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర సమయంలోనూ పోలీస్ కమిషనర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో మరోసారి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి సీపీ గౌస్ ఆలం పై సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్లో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని కరీంనగర్ జిల్లా కానిస్టేబుళ్లతో డ్రైవర్లుగా ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సదరు వాహనాన్ని సీపీ తన స్నేహితుడైన ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి ఇంటికి పంపిస్తున్నారని ఆరోపణలు చేశారు. సాధారణ పౌరుల కోసం వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించి ప్రతిరోజూ నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారని వ్యాఖ్యానించారు. గత 8 నెలలుగా ఆ వాహనం డీజీపీ కార్యాలయం సమీపంలోని అపార్ట్మెంట్ వద్ద సంచరిస్తోందని, దీనిపై డీజీపీ శివధర్ రెడ్డికి సమాచారం ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉందని ఆయన అన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని, ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు త్వరలో బయటపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ 15 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే తాను సేకరించిన అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఈ వ్యవధిలో సంబంధిత అధికారులు తమ తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే యాంటీ ఛాంబర్లో జరిగిన ఘటనలు, హైదరాబాద్ రిసార్ట్లలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ వీడియోలు చూపిస్తానని తెలిపారు. అవసరమైతే అసెంబ్లీ మీడియా పాయింట్లో కూడా ఆధారాలను బయటపెడతానని అన్నారు.
ఒకరిద్దరు అధికారుల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేయకూడదని, నిజాలు బయటకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచుతానని ఎమ్మెల్యే స్పష్టం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి కారణమైంది. ఈ అంశంపై పోలీస్ శాఖ లేదా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.
