
Missing Girl Case: పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలను షాక్కు గురిచేసింది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కొన్నిసార్లు ఎంత పెద్ద విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మళ్లీ నిరూపించింది. 17 ఏళ్ల యువతిపై తండ్రి చేసిన చర్య, ఆ తర్వాత ఆమె అద్భుతంగా బయటపడటం, తిరిగి ఇంటికి చేరి తండ్రిని రక్షించాలని కోరడం ఇలా అన్ని ఒక విషాద, విశేషమైన కథగా నిలిచిపోయింది.
"3 months ago, her father threw her into a canal near #ferozepur for 'honour', filmed it & left her to die.
He’s been in jail for her 'murder'.
Today she walked back alive.
She says: 'Release my father from jail. My mother is the real culprit.'#HonorKilling #Punjab" pic.twitter.com/ZBXthtULwe— swaran danewalia (@danewaliaswaran) December 7, 2025
ఇంట్లో నెలల కొద్దీ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. చదువు మధ్యలోనే మానేసి ఖాళీగా తిరుగుతున్న కూతురిని చూసి తండ్రి సుర్జిత్ సింగ్ ఆందోళన చెందేవాడు. కొన్నిసార్లు అతి అనుమానంతో కుమార్తె ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తేవాడు. భార్య మాత్రం కూతురి పక్షమే ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇలా పెరుగుతున్న కుటుంబ కలహాలు చివరకు ఒక భయంకరమైన రాత్రిని తీసుకొచ్చాయి.
సెప్టెంబర్ 29 రాత్రి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆ రోజు మద్యం మత్తులో ఉన్న తండ్రి సుర్జిత్ సింగ్ ఆగ్రహంతో కుమార్తె చేతులను తాడుతో బిగించి కట్టేశాడు. అతని కళ్ల ముందే భార్య, మరొక ముగ్గురు చిన్న కుమార్తెలు ఆ భయానక దృశ్యాన్ని చూసి వణికిపోయారు. ఏమి జరుగుతుందో అర్థం కాక తల్లి విలపించింది. కానీ కోపంతో ఉన్న సుర్జిత్ సింగ్ పెద్ద కుమార్తెను కాలువ వద్దకు తీసుకెళ్లి చేతులు కట్టేసి నీటిలోకి తోశాడు. నీటిలో కొట్టుకుపోతున్న కూతురిని చూసి “బై బై” అంటూ చేతులు ఊపడం అక్కడున్నవారిని మరింత కంగారు పరిచింది.
ఈ సంఘటనను అతడు మొబైల్ ఫోన్లో వీడియోగా రికార్డ్ చేశాడు. తర్వాతా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఇద్దరూ ఆమె మరణించిందని భావించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుర్జిత్ సింగ్పై హత్య కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. పూర్తిగా తల్లడిల్లిన కుటుంబం ఆ యువతి కోసం ఎక్కడికక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.
కానీ ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిన తర్వాత, డిసెంబర్ 7న ఆ బాలిక అనూహ్యంగా తిరిగి వచ్చింది. ఆమె సజీవంగా కనిపించడం కుటుంబానికి, పోలీసులకు ఆశ్చర్యకరంగా అనిపించింది. తాను ప్రాణాలతో ఎలా బయటపడగలిగానో ఆమె వివరించింది. నీటిలో పడిన తర్వాత తనకు గాయం అయ్యిందని, కొంతసేపు స్పృహ కోల్పోయిందని తెలిపింది. స్పృహ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్లి చికిత్స పొందినట్లు చెబుతున్నప్పటికీ, ఆ రెండు నెలల కాలంలో తాను ఎక్కడ ఉండిందో మాత్రం వెల్లడించలేదు. తలకు గాయం కారణంగా కొన్ని విషయాలు గుర్తు లేవని మాత్రమే చెప్పింది.
తన తండ్రిని జైలు నుండి విడుదల చేయాలని ఆ యువతి కన్నీళ్లతో పోలీసులను వేడుకుంది. కుటుంబంలో తన ముగ్గురు చెల్లెళ్లను చూసుకునేవారు ఎవరూ లేరని, వారికి తండ్రి తప్ప మరెవరూ ఆధారం కాదని వేడుకుంది. తల్లి అప్పట్లో కోపంతో చెడు మాటలు చెప్పడంతో తండ్రి రెచ్చిపోయాడని ఆమె చెప్పింది. తాను బతికొచ్చినందున హత్య కేసు కొనసాగే అవసరం లేదని, తన తండ్రికి మరో అవకాశం ఇవ్వాలని కోరింది. బంధువులపై నమ్మకం లేదని, తనకు రక్షణ కల్పించాలని కూడా అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన హత్య కేసును హత్యాయత్నంగా మార్చనున్నట్లు ప్రకటించారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ALSO READ: Facts: పెరుగు తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..





