
రంగారెడ్డి జిల్లా బ్యూరో, (క్రైమ్ మిర్రర్): తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల భద్రతే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు కొంతమంది స్వయంగా కబ్జాదారులకు మద్దతు ఇస్తూ, నకిలీ పత్రాలపై భూముల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇదే సందర్భంలో ఐదు పత్రికలకు చెందిన నలుగురు విలేకరులు – ఒక్కొక్కరు నాలుగు చోట్ల 600 గజాల భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా నకిలీ రూ.20, రూ.50, రూ.100 స్టాంపు పేపర్లను ఉపయోగించి ప్రభుత్వ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సమాచారం.
దీనితో పాటు పది రోజుల క్రితం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ నకిలీ స్టాంపు ముఠా అరెస్టయ్యింది. ఇప్పటికైనా ఈ నకిలీ స్టాంపుల ముఠా – విలేకరుల మధ్య ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో రాచకొండ కమిషనర్ ప్రత్యేక విచారణ అధికారులతో విచారణ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఈ ముఠాలు అంతలా కృతకత పర్చుకున్నాయా?, లేక అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రజా ఆస్తుల పరిరక్షణలో అధికారులే భాగస్వాములై ఉంటే, ప్రజలు న్యాయాన్ని ఎలా ఆశించగలరు.? ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాలో అన్నిటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం తీవ్రంగా కనిపిస్తోంది.