కాంగ్రెస్ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందాం..!
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీలు నెరవేర్చలేదు
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశంలో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సమైక్యంగా పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మార్చి 10, 2026న గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హామీలు నెరవేర్చలేదని, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆయన ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన నిధులను ఢిల్లీకి మళ్ళిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో ‘రైతు బంధు’ ఆగిపోయి ‘రాహుల్ బంధు‘ నడుస్తోందని ఎద్దేవా చేశారు.
బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చే తప్పుడు గణాంకాలను, ‘బుల్డోజర్’ పద్ధతులను అడ్డుకుని ప్రజల గొంతుకను బలంగా వినిపించాలని నేతలకు సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఒక రెఫరెండంగా భావించి, ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు.
