*కేరళలో వైద్యుల నిర్లక్ష్యం
*ఆపరేషన్ చేసి మహిళ కడుపులో కత్తెర మరిచిన వైద్యులు
*ఐదేళ్లుగా నరకయాతన అనుభవించిన మహిళ
*తాజాగా వెలుగులోకి వచ్చిన అసలు విషయం
కేరళలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ దాదాపు ఐదేళ్ల పాటు నరకం అనుభవించింది. ఈ దారుణ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలప్పుజ జిల్లా పున్నప్రా తీర ప్రాంతానికి చెందిన ఉష జోసెఫ్ కుట్టి(51) అనే మహిళకు ఐదేళ్ల క్రితం అలప్పుజ మెడికల్ కాలేజ్ వైద్యులు గర్భాశయ చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆమె తరుచూ కడుపునొప్పి, యూరిన్లో రక్తం రావడం లాంటి సమస్యలతో నరకం అనుభవిస్తోంది. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు సిటి స్కాన్ చేయించుకున్నారామె. ఎక్స్ రే రిపోర్ట్ చూసిన డాక్టర్ షాక్కు గురయ్యాడు. గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్యులు.. ఆమె కడుపులో పొరపాటున ఒక సర్జికల్ కత్తెరను మర్చిపోయినట్లు గుర్తించారు.
బాధితురాలికి బెదిరింపులు
తన కడుపులో కత్తెర ఉన్న విషయం తెలిసిన తర్వాత మానసికంగా ఆందోళనకు గురయ్యారు జోసెఫ్ కుట్టి. సదరు ఎక్స్-రే రిపోర్టులను తీసుకుని అలప్పుజ మెడికల్ కాలేజ్ వైద్యుల దగ్గరికి ఆమె వెళ్లారు. వైద్యులు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని తమను బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పుతెచ్చిన ఆ ఆస్పత్రిలో మరోసారి ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉందని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందించారు. బాధితురాలికి చాలా అన్యాయం జరిగిందని.. ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో నరకం అనుభవించారని చెప్పారు. ఆమె ఆపరేషన్కు అయ్యే ఖర్చు నేను భరిస్తానని చెప్పారు. ఉషకు మెరుగైన చికిత్స కోసం కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తక్షిణ ఆర్థిక సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Also: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది కళ్లు తీసేశారు!
