* అధికారంలోకి వస్తే రాజ్యసభ
* కోడలికి జగిత్యాల అసెంబ్లీ టికెట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో ఒక పదవి ఖరారు చేశారా? ఆయన పార్టీలో చేరకముందే అది డిసైడ్ అయిందా? గులాబీ పార్టీలో భారీ ఆఫర్ తోనే ఆయన పార్టీలో చేరుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని జీవన్ రెడ్డి తెంచుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి విధితమే. మొన్ననే జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలను అభిమానులకు వివరించే ప్రయత్నం చేశారు. గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలు మంతనాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు.
కేశవరావు స్థానంలో..
అయితే జీవన్ రెడ్డి భారీ ఆఫర్ తోనే గులాబీ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజ్యసభకు జీవన్ రెడ్డి.. ఆయన కోడలుకు జగిత్యాల అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు కేసిఆర్ తో పాటు కేటీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి కి కీలక పదవి కట్టబెట్టనున్నారు. ఆ పార్టీలో అత్యున్నత పదవిగా సెక్రటరీ జనరల్ ట్రీట్ చేస్తారు. ఇతర పార్టీలో ఈ హోదా కనిపించదు. కానీ బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నేత కేశవరావుకు ఈ పదవి ఇచ్చారు. సుదీర్ఘకాలం పాటు ఇదే పదవిలో ఆయన కొనసాగారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ తరఫున కీలక పాత్ర పోషించారు. అయితే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు అదే పదవిని జీవన్ రెడ్డిని నియమించనున్నారు. తద్వారా పార్టీ తరపున జాతీయస్థాయిలో గళం వినిపించే అవకాశం కల్పించారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఇవ్వనున్నారు.
భారీ వ్యూహంతోనే..
జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన కోడలు చరిష్మారెడ్డిని వారసురాలిగా తేవాలని భావిస్తున్నారు జీవన్ రెడ్డి. కానీ ఇంతలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిపోయారు. జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ హై కమాండ్ వినలేదు. అందుకే ఆయన గులాబీ పార్టీలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన కోడలు చరిష్మారెడ్డిని గులాబీ పార్టీ తరఫున బరిలో దించనున్నారు. ఇప్పటికే ఆమె క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలను ప్రతీకరం తీర్చుకోవాలని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. తాను రాజ్యసభకు ఎంపిక కావడం జాతీయ రాజకీయాల్లోకి.. తన వారసురాలిగా కోడలిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
