* భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో హిందూమతంలోకి తిరిగి ప్రవేశం
* గతంలోనే వైసిపి అధినేత చెప్పారని చెబుతున్న వైనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ జగన్మోహన్ రెడ్డి మతమార్పిడిలను ప్రోత్సహించారా? వేరే మతంలోకి వెళ్లిన వారిని హిందూమతంలోకి తెప్పించేందుకు ప్రయత్నించారా? టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత? పొలిటికల్ వర్గాల్లో దీనిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. నిన్ననే ఒక ముస్లిం దంపతులను హిందూమతంలో చేర్చారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తనకు కీలక సూచనలు చేశారని చెప్పారు. వివిధ కారణాలతో హిందూ మతం నుంచి వేరే మతం లో చేరిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని జగన్ సూచించారట. ఇలా ఓ 60 మందిని హిందూమతంలోకి తిరిగి రప్పించేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారట. ఇంతలో ఎన్నికలు వచ్చేసాయట. అందుకే వీలు పడలేదట. ఇప్పుడు హిందూమతంలోకి అందర్నీ ఆహ్వానించడం అందులో భాగమేనట. ప్రస్తుతం దీనిపైనే విస్తృత చర్చ నడుస్తోంది. రకరకాల విశ్లేషణలు దీనిపై కొనసాగుతున్నాయి.
ఆ తరహా విమర్శలు అధికం
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక విమర్శ బలంగా వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్యమతానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు హిందూ మతం పట్ల నిర్లక్ష్యం కొనసాగిందన్న విమర్శ ప్రధానంగా ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల నియామకం.. అన్యమత ప్రచారం ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా కొనసాగాయి. టీటీడీ అధ్యక్షులుగా కొనసాగిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు సైతం అన్యమతస్తులు అని ఒక ప్రచారం ఉంది. అయితే ఆ ఇద్దరూ దీనిని ఖండించారు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో గతంలో జరిగిన వివాదాలు బయటకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఒక ముద్ర పడింది. అన్య మత ముద్ర ఎక్కువయింది. ప్రధానంగా టీటీడీ లడ్డు వివాదం ఆ పార్టీపై అనుమానపు చూపులు చూసేలా చేసింది.
ఆ కుటుంబం ఆది నుంచి..
స్వతహాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్ మతంలో కొనసాగుతోంది. దశాబ్దాలుగా కుటుంబం అదే పరంపరను కొనసాగిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆ కుటుంబం పై మతపరంగా ఎటువంటి ముద్ర లేదు. అంతలా జాగ్రత్తలు తీసుకున్నారు రాజశేఖరరెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే ఆ కుటుంబం పై అన్యమత ముద్ర పడింది. ఆయన సారథ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉండడం.. ఇందు ఆలయాలకు సంబంధించిన రకరకాల పరిణామాలు జరగడంతో ఆ ప్రభావం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై పడింది. అన్నింటికీ మించి అన్య మతాలకు సంబంధించిన వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు గా ఉన్నాయి. ఇది కూడా ప్రజల్లో అనుమానాలకు పెంచేందుకు కారణం అయ్యింది.
కొన్ని రకాల పరిణామాలతో..
ఇటీవల రాష్ట్రంలో కొన్ని రకాల పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అనుమానపు చూపులు చూసేలా చేశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేక ముద్రను అంటించుకుంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై కూడా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే అటువంటి వ్యతిరేక ముద్రను జరుపుకోవాల్సిన ఆవశ్యకత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏర్పడింది. అందులో భాగమే టిటిడి అధ్యక్షుడిగా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి.. ఇలా అన్యమతస్తులను హిందూ మతంలోకి రప్పించే బాధ్యత తీసుకున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.
