
సినీ నటుడు పోసాని కృష్ణమురళీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అంతా… వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే చేశానంటూ… పోసాని విచారణలో అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. తాను మాట్లాడే మాటలన్నీ సజ్జలవే అని… ఆయన ఇచ్చిన స్ట్రిప్ట్నే ప్రెస్మీట్లలో చదివానని పోసాని పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు… తన వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్రెడ్డి వైరల్ చేశాడని పోలీసులకు చెప్పాడట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, ఆయన కుటుంబసభ్యులను… లోకేష్, ఆయన కుటుంబసభ్యులను కూడా… అసభ్యకరంగా దూషించడం వెనుక కూడా సజ్జల ఉన్నారని ఒప్పుకున్నాడట పోసాని. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది కలిగించాలనే కుట్రతోనే ప్రెస్మీట్లు పెట్టి బూతులు తిట్టినట్టు అంగీకరించినట్టు పోలీసులు చెప్తున్నారు. సజ్జల ప్రెస్మీట్లు పెట్టిస్తే… ఆయన కుమారుడు వీడియోలు వైరల్ చేశాడని… నేరం ఒప్పుకుంటూ… నేర అంగీకార పత్రంపై పోసాని సంతకం పెట్టారని పోలీసులు అంటున్నారు.
పోసాని ఇచ్చిన స్టేట్మెంట్తో వైఎస్ఆర్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ అరెస్టుకు కూడా లైన్క్లియర్ అయ్యిందని కూటమి నేతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచో సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆయన కుమారుడు భార్గవ్రెడ్డిని టార్గెట్ చేసిందన్నది బహిరంగ సత్యం. ఇప్పుడు పోసాని అరెస్ట్… సజ్జలకు, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా పోసాని ఇచ్చిన …..స్టేట్మెంట్తో వారిని అరెస్ట్ చేసేందుకు పావులు కదిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే… టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడు భార్గవ్రెడ్డిపై… సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, నాయకులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసు ఉంది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళీ స్టేట్మెంట్తో అరెస్ట్ తప్పదేమో మరి.