
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా మిస్సౌల్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడినట్లైంది. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగుతుందని ఆయన తెలిపారు. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తున్నట్టు ప్రకటించనున్నారు.
నిన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ‘ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్’ పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. దోహాలోని యూఎస్ స్థావరంపై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ వెల్లడించింది. శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. ఇరాన్ దాడుల వేళ ఖతార్, కువైట్, బహ్రెయిన్ తమ గగనతలాలను మూసివేశాయి. ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ ‘సిచువేషన్ రూమ్’కు వెళ్లి పరిస్థితులను గమనించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 40 వేలమంది సైనికులను అమెరికా మోహరించింది. ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, ఖతార్, సిరియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని దాదాపు 19 ప్రాంతాల్లో వాషింగ్టన్ సైనిక స్థావరాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అతిపెద్దది. ఇక్కడ దాదాపు 10 వేలమంది సైనికులు ఉన్నారు. ఈ స్థావరంలో గత రెండు వారాల నుంచి దాదాపు 40 మిలిటరీ విమానాలు అదృశ్యమైన శాటిలైట్ చిత్రాలు ఇటీవల బయటకు వచ్చాయి. ఇరాన్ దాడుల నుంచి తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా వాటిని తరలించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అల్-ఉదీద్ ఎయిర్ బేస్పై క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు పేర్కొంది. తమ దేశంలోని ఎయిర్బేస్లపై ఇరాన్ దాడి చేయడానికి ఆ దేశం ఖండించింది. ఇరాన్ చర్యకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని వెల్లడించింది. అయితే ఖతార్లోని తమ మిలిటరీ స్థావరాలను ఇరాన్ క్షిపణులు తాకలేదని అమెరికా వెల్లడించింది. . ఇరాన్ దాడులతో ఖతార్లోని చమురు క్షేత్రాలకు ఎలాంటి నష్టం కలగలేదని సమాచారం.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ఖతార్కు సంఘీభావం ప్రకటించారు. ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఖతార్పై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఇరాన్ దెబ్బతిస్తున్నట్లు తెలిపింది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా, ఉత్తర అమెరికాలోని పలు నగరాలు, యూరప్ దేశాలకు తక్షణ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.