క్రీడలు

India vs SA 1st ODI: ఫస్ట్ వన్డేలో గ్రాండ్ విక్టరీ..0-1 ఆధిక్యంలో టీమిండియా!

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. కుల్దీప్, హర్షిత్ రాణా బౌలింగ్ దెబ్బకు 332 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది. 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. చివరి వరకు పోరాడినా, భారత బౌలర్ల ధాటికి కోలుకోలేకపోయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పాటు, కుల్దీప్ యాదవ్, రాణా కీలక వికెట్లు పడగొట్టి గెలుపులో కీలపాత్ర పోషించారు.

తొలిలోని భారీగా ఎదురుదెబ్బ

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా, అర్ష్‌ దీప్ సింగ్ ధాటికి 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రియాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) లను హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చగా, కెప్టెన్ మార్‌క్రమ్ (7) ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఈ దశలో మాథ్యూ బ్రీట్జ్‌ కే (72), టోనీ డి జోర్జి (39) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ ను  నిలబెట్టే ప్రయత్నం చేశారు. దూకుడుగా ఆడుతున్న జోర్జిని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (37) వేగంగా ఆడినా, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మార్కో జాన్సెన్ (70) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఒకే ఓవర్‌ లో జాన్సెన్, బ్రీట్జ్‌ కేలను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో కార్బిన్ బాష్ (67) కూడా అద్భుతంగా పోరాడాడు. సుబ్రాయెన్ (17), నండ్రే బర్గర్ (17)తో కలిసి చిన్నపాటి భాగస్వామ్యాలు నెలకొల్పి విజయానికి చేరువగా తెచ్చాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమించిన బాష్ ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4,  హర్షిత్ రాణా 3, అర్ష్‌ దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు.

దుమ్మురేపిన భారత బ్యాటర్లు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. విరాట్ కోహ్లీ (120 బంతుల్లో 135) అద్భుత శతకంతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో వన్డే డిసెంబరు 3న రాయ్ పూర్ లో జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button