అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి మృతదేహం లభ్యమవ్వడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు వివరాలను వెల్లడించిన డీఐజీ కోయ ప్రవీణ్.. ఈ ఘటనలో వెలుగులోకి వచ్చిన అంశాలు హృదయ విదారకమని తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీటిలో ముంచి హత్య చేసి, రాత్రంతా మృతదేహాన్ని అలాగే ఉంచి అదే గదిలో నిద్రపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు కులవర్ధన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో లేడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని స్పష్టం చేశారు.
చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ గాలింపు ప్రారంభించారు. ఇంటి సమీపంలోని ఒక ఇంట్లో నివసించే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఘటన బయటపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే మదనపల్లిలో ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొందరు కావాలనే గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారని డీఐజీ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత నేరుగా బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. బాలికకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు.
డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి నియంత్రణపై పగడ్బందీ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. అయితే ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచాయి. బాలిక హత్య కేసు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
ALSO READ: తమ శరీర భాగాలను తామే తినే జంతువులు ఏవి?
