తొర్రూరు, క్రైమ్ మిర్రర్: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యకర్తలతో కలిసి నిలబడిన దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్లు పోలీస్ స్టేషన్కు చేరుకుని మద్దతు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కష్టపడి పనిచేసిన మా కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో న్యాయం జరగలేదని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచాయి.
పోలీసుల వైపు నుంచి అయితే చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని, శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
