క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 19, 2026 గురువారం తెల్లవారు జామున సుమారు 02:33 AM నుండి 02:35 AM గంటల మధ్య ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప నిపుణులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మరియు నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో గురువారం తెల్లవారు జామున సుమారు 02:33 AM నుండి 02:35 AM గంటల మధ్య ప్రకంపనలు కనిపించాయి అన్నారు.
అలాగే ప్రకాశం జిల్లాలోని దర్శి, అద్దంకి, ముండ్లమూరు మరియు పొదిలి ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ధ్రువీకరించింది.
వినుకొండ పట్టణానికి వాయువ్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే, గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఇళ్లలోని వస్తువులు కదలడంతో భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
భూకంప నిపుణులు రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని స్వల్ప ప్రకంపనలు (Aftershocks) వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
