e-office: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలను వేగవంతంగా, పారదర్శకంగా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖలలోని ఫైళ్లను పాత పద్ధతిలో హ్యాండిల్ చేయడం వల్ల ఏర్పడే ఆలస్యం, తప్పిపోయే ప్రమాదం, కాగితపు ఫైళ్ల నిర్వహణలో ఇబ్బందులను నివారించేందుకు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు కొన్ని శాఖల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసిన ఈ విధానం సంతృప్తికరంగా ఉన్నందున, ఈ-ఆఫీస్ విధానాన్ని అన్ని శాఖల్లో విస్తరించాలని ప్రభుత్వం సూచించింది. డిజిటల్ ఫైల్ విధానం ద్వారా కింది స్థాయి సెక్షన్ ఆఫీసర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఫైళ్ల పరిశీలన, నోటింగ్, డ్రాఫ్టింగ్, సంతకం, అప్రూవల్, రికార్డుల నిర్వహణ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ-ఆఫీస్ పూర్తిగా అమల్లోకి వస్తే..
ఫైళ్ల కదలిక వేగవంతం:
సెక్షన్ ఆఫీసర్ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఫైళ్లు తక్షణమే, ఒక్క క్లిక్ ద్వారా ఆన్లైన్లో తరలింపులు జరగడం వల్ల పాలన వేగం పెరుగుతుంది.
పారదర్శకత:
ఏ ఫైల్ ఏ అధికారి వద్ద ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉందో సాఫ్ట్వేర్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ఫైళ్లను ఆపే అవకాశాలు తగ్గుతాయి.
ఫిజికల్ ఫైళ్ళ అవసరం తగ్గడం:
పాత పద్ధతిలో కాగితపు ఫైళ్లు చెదిలిపోవడం, కాలిపోవడం లేదా అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ఫైళ్లను క్లౌడ్ సర్వర్లో భద్రంగా భద్రపరిచడం వల్ల డేటా ఎప్పుడూ కోల్పోబడదు.
డిజిటల్ సిగ్నేచర్:
అధికారులు, ఇతర పర్యటనల్లో ఉన్నా, క్యాంప్ ఆఫీసుల్లో ఉన్నా ఆన్లైన్లో ఫైళ్లను సులువుగా క్లియర్ చేయవచ్చు.
పర్యావరణ పరిరక్షణ:
వేల టన్నుల కాగితాలు వాడకపోవడం వల్ల స్టేషనరీ ఖర్చులు తగ్గుతాయి మరియు చెట్లను కాపాడడం ద్వారా పర్యావరణానికి మేలు అవుతుంది.
ప్రస్తుతం అమలు:
ఏపీలోని కొన్ని శాఖల్లో ఈ-ఆఫీస్ విధానం విజయవంతంగా అమలులో ఉంది. తాజాగా రాష్ట్రంలోని అన్ని శాఖలు, జిల్లా కార్యాలయాలు, అటానమస్ సంస్థలు కూడా ఈ విధానాన్ని పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పాత రికార్డుల డిజిటలైజేషన్:
పాత ఫైళ్లు కూడా డిజిటల్ విధానంలోకి మార్చడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టబడ్డాయి.
జిల్లా నుంచి సచివాలయం కనెక్టివిటీ:
జిల్లా కార్యాలయాల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకు నేరుగా ఫైళ్లను పరిశీలించడం, క్లియర్ చేయడం సాధ్యం కావడంతో కార్యాలయాల్లో ఫైళ్ల కోసం తిరగాల్సిన అవసరం తగ్గుతుంది.
ఈ విధానం పూర్తిగా అమల్లోకి రాగానే ప్రభుత్వ సేవలు వేగంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు అందుతాయి.
