•ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఒకటే మార్గం…
•విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి…
•పెద్ద కందుకూరు జడ్పీహెచ్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…
•యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
చౌటుప్పల్,క్రైమ్ మిర్రర్:- పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నారని,అందులో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంత మంది ఉన్నారని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్ట్ ల వారిగా సిలబస్ మొత్తం పూర్తయిందా లేదా అని ఆరా తీశారు.ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా అని అడిగి , ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు విద్యార్థులకు వేకప్ కాల్ చేస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గణితంలో కలెక్టర్ సూటిగా ప్రశ్నలు వేసి, విద్యార్థులకు బోర్డు పై అర్థమయ్యే విధంగా కలెక్టర్ పాఠాలు బోధించారు.
పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పటి నుండే కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని , పరీక్షలకు ఒక ప్రణాళిక వేసుకొని మంచిగా చదివి 100% శాతం ఉత్తీర్ణత పొంది మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. పదవ తరగతి అనేది విద్యార్థులకు జీవితంలో పై స్థాయికి వెళ్లడానికి మొదటి మెట్టు అని కలెక్టర్ విద్యార్థులకు హిత బోధ చేశారు. విద్యార్థులు వెనుకబడిన సబ్జెక్టులపై ఒకటికి రెండుసార్లు చదివి తనకు తానే అంకితభావంతో వ్రాసి పరిశోధించుకోవాలన్నారు.బీద కుటుంబం నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే తరతరాలుగా మార్చేది చదువు ఒకటే మార్గం అని కలెక్టర్ హితవు పలికారు.ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన అందుతుందని,ఇప్పటి నుండే గ్రామాల్లో ప్రజలకు, విద్యార్ధి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధనపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలో చదువుకునేల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
