పెళ్లి కాలేదని డిప్రెషన్.. 20వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
పెళ్లి కాలేదనే మానసిక వేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పెళ్లి కాలేదనే మానసిక వేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని అత్తాపూర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న ప్రవీణ్ అనే 30 ఏళ్ల యువకుడు ఆదివారం మధ్యాహ్నం 20 అంతస్తుల భవనం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా పెళ్లి కాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, డిప్రెషన్లోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా బయటకు వెళ్లిన ప్రవీణ్ ఈ ఘోర నిర్ణయం తీసుకున్నాడని వారు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదే తరహాలో ఇటీవల హైదరాబాద్లో మరో ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి అనే 26 ఏళ్ల ఐటీ యువతి హుస్సేన్ సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం హుస్సేన్ సాగర్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణలో విజయలక్ష్మి గత కొంతకాలంగా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
నగరంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు మానసిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లను ఒంటరిగా భరించలేక కొందరు యువత తీవ్ర నిర్ణయాలకు పాల్పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం కలిసి ఇలాంటి సమస్యలను గుర్తించి, సరైన సమయంలో మానసిక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ ఘటనలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతూ, ఆత్మహత్యలకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నారు.
ALSO READ: ఎఫైర్ అంటగట్టారని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం!









