
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : కరీంనగర్కు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకరు కాదు.. ఇద్దరు కాదు… ఏకంగా ఈ జిల్లా నుంచి ముగ్గురు నేతలను కేబినెట్లోకి తీసుకుంది రేవంత్రెడ్డి సర్కార్. ఈ విషయం తెలిసి… ఏటి బాబు ఈ విడ్డూరం..! అంటూ… ముక్కున వేలేసుకుంటున్నారు పార్టీ నేతలు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా. గతంలో గులాబీ గాలి వీచింది ఈ జిల్లాలో. కానీ… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. కాంగ్రెస్ వైపు మళ్లింది. మొత్తంగా కాకపోయినా… మెజార్టీ స్థానాలను హస్తం పార్టీకి కట్టబెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా… ఏడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఈ జిల్లాకు.. ఒక మంత్రి పదవి ఇస్తే సరిపోయేది. రెండు ఇచ్చినా ఓకేలే అనుకునేవారు. కానీ… ముగ్గురు అంటేనే ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ కేబినెట్లో ఇప్పటికే పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుకు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.
ఇప్పుడు కేబినెట్ విస్తరణలో భాగంగా… ఈ జిల్లా నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో.. కరీంనగర్ జిల్లా నుంచి కేబినెట్లో ముగ్గురు ఉన్నారు. సామాజిక సమీకరణాలు… వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం పెంచాలన్నది అధిష్టానం ఉద్దేశం కావొచ్చు. కానీ… ఒక జిల్లా నుంచి.. అది కూడా ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే ఇచ్చిన జిల్లా నుంచి ముగ్గురిని కేబినెట్లోకి తీసుకున్నారంటే… అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండటంతో.. వర్గపోరు కూడా ఎక్కువగానే ఉంది. మంత్రుల మధ్య గ్యాస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల.. నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ విషయం వచ్చినట్టు సమాచారం. అయినా… జిల్లా నుంచి మరో నేతకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే… గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకే… ఇలా చేశారా…? లేక.. ఇంకేదైనా కారణం ఉందా…? జిల్లాలో ఇప్పటికే రెండు పవర్ హౌస్లు ఉన్నా.. మూడో పవర్ హౌస్ ఏర్పాటుకు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది తేలాల్సి ఉంది.