Low Temperatures: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి పులి పంజా విసురుతోంది. చల్లని గాలులతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని లంబసింగి లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పల్లెల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పొగమంచు కారణంగా ఉదయాన్నే బయటకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. చలికి చిన్నపిల్లలు, వృద్ధులు చలితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ఉభయ రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కూడా చలి తీవ్రత కనిపిస్తోంది. రాత్రి వేళల్లో రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. ప్రజలు స్వెట్టర్లు, దుప్పట్లు, షాల్స్ ఉపయోగిస్తూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. కొందరు చలి నుంచి ఉపశమనం కోసం వేడి పానీయాలను ఆశ్రయిస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
“ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది. స్వెట్టర్లు, షాల్స్, మఫ్లర్లు, దుప్పట్లు వాడాలి. చల్లని గాలికి నేరుగా గురికాకుండా జాగ్రత్తపడాలి. వేడి ఆహారం, పానీయాలు తీసుకోండి. వేడి నీరు, టీ, కాఫీ, సూపులు తాగడం మంచిది. వేడి ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది, చలి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా చల్లని నీటితో స్నానం చేయకండి. గోరువెచ్చని నీరు వాడడం మంచిది. ఉదయం పొగమంచులో బయటకు వెళ్లకుండా ఉండండి. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిది. చలి వల్ల చర్మం పొడిగా మారుతుంది. నూనె లేదా మాయిశ్చరైజర్ వాడాలి. పెదవులు పగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.చలి కాలంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. సరైన దుస్తులు, మంచి ఆహారం, శుభ్రత పాటించడం ద్వారా చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు” అంటున్నారు నిపుణులు.





