
Telangana Rythu Bharosa: వానాకాలం సాగు సిద్ధం అవుతున్న వేళ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. జూన్ 16 నుంచి 9 రోజుల పాటు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 2 ఎకరాల్లోపు రైతులకు తొలి రోజు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడ్డాయి.
ఏకకాలంలో రైతు భరోసా
వానాకాలం సాగుకు సంబంధించి ఏకకాలంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటసాగు కోసం ఎవరి దగ్గర చేయిచాచి అడగకుండా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే, రైతు భరోసాను ఏకకాలంలో అమలు చేయాలని నిర్ణయించామన్నారు. సోమవారం నుంచి మొదలైన రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు బదిలీ అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70,11,184 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
వ్యవసాయ యూనివర్సిటీ నుంచి రైతులతో ముఖాముఖి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతువేదికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రైతు వేదికలను ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఇక్కడి నుంచే సీఎం వానాకాలం రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని మీటనొక్కి ప్రారంభించారు. రైతులకు కనీస మద్దతు ధర, బోనస్, రైతుబీమా అన్నీ కలిపి ఇప్పటి వరకు 18 నెలల్లోనే తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.1,01,728 కోట్లు ఖర్చు పెట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
Read Also: అన్నకు వకాల్తా పుచ్చుకున్న కవిత – రూటు మారిందా..!