తెలంగాణ

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బరిలో బొంతు రామ్మోహన్.. డిన్నర్ పార్టీలతో హల్ చల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిస్తే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు ఖాయమనే చర్చ సాగుతోంది. హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ప్రస్తుతం ఎవరూ లేరు. దీంతో జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే మంత్రి అవుతారనే టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు రేవంత్ కేబినెట్ లో మైనార్టీ, బీసీల్లో యాదవ ,మున్నురు కాపుల నుంచి ప్రాతినిధ్యం లేదు. మాములుగా ఈ మూడు వర్గాలు లేకుండా మంత్రివర్గం ఉండదు. ఈ లెక్కన వచ్చే కేబినెట్ విస్తరణలో మైనార్టీ. మున్నురుకాపు, యాదవ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి బెర్త్ ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాలతో పాటు గాంధీభవన్ లో జోరుగా సాగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈ మూడు వర్గాల నేతలు కన్నేశారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకుని విజయం సాధిస్తే.. మంత్రివర్గంలో చోటు ఖాయమని కలలు కంటున్నారు. అందుకే జూబ్లీహిల్స్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

2023లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మరోసారి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ తన అడ్డా అంటున్న అజార్.. తనకు టికెట్ రాకుండా ఎవరు అడ్డుకోలేరని చెబుతున్నారు. అజార్ తనదే టికెట్ అని చెబుతున్నా.. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా టికెట్ తమకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ రేసులో ఉన్నారు. పీజేఆర్ కూతురు విజయారెడ్డి సైతం తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రేసులో ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చారు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.

బొంతు రామ్మోహన్ ది మున్నురు కాపు సామాజికవర్గం. ఆయన భార్య శ్రీదేవి యాదవ్. శ్రీదేవి పుట్టిన అమీర్ పేట ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు ఎక్కువ. హైదరాబాద్ మేయర్ గా పని చేసిన బొంతు రామ్మోహన్ కు జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంచి పట్టుంది. నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు భారీగా ఉండటం తనకు కలిసి వస్తుందని బొంతు లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్సులు కూడా బొంతుకు ఉన్నాయంటున్నారు. గతంలో కేటీఆర్ సన్నిహితుడిగా ఉన్న బొంతు.. ఆయనకు సంబంధించిన కీలక సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తున్నారనే టాక్ ఉంది. అందుకే బొంతుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే బొంతుకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వొచ్చనే చర్చ గాంధీభవన్ లో సాగుతోంది.

మరోవైపు తనకు టికెట్ వచ్చేలా సహకరించాలంటూ జర్నలిస్టులకు బొంతు రామ్మోహన్ విందు ఇచ్చారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందంటూ తనకు అనుకూలంగా వార్తలు రాయాలని జర్నలిస్టులను ఆయన కోరినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button