Ritu Tawde Elected Mumbai Mayor: సుమారు 44 ఏళ్ల తర్వాత ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 78వ మేయర్గా ఆ పార్టీకి చెందిన రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమలం పార్టీ మొదటిసారిగా 1982-83లో ఈ పదవిని దక్కించుకోగా, మళ్లీ ఇన్నేళ్లకు ఆ అవకాశం లభించింది.
ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెర
రీతూ తావ్డేతో పాటు శివసేన అభ్యర్థి సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. దీంతో గత 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. జనవరి 15న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 227 సీట్లకు గాను బీజేపీ 89 స్థానాలను గెలుచుకోగా, మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం 29 స్థానాలను దక్కించుకుంది. ఈక్రమంలో అధికార కూటమి మేజిక్ ఫిగర్ 114ను దాటి అధికారాన్ని చేజిక్కించుకుంది.









