-
భూముల విలువలు “20% నుండి 40%” వరకు పెరిగే అవకాశం
-
అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను సుమారు “40% నుండి 60%” వరకు పెరిగే అవకాశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వ రాబడిని పెంచడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
సవరించిన కొత్త ధరలు “ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి. గతంలో ఆగస్టు 2024 లోనే అమలు చేయాలని భావించినప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ప్రాంతాన్ని బట్టి భూముల విలువలు “20% నుండి 40%” వరకు పెరిగే అవకాశం ఉంది.
కొన్ని అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఇది “100% నుండి 400%” వరకు కూడా ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఎకరాకు కనీస రిజిస్ట్రేషన్ విలువ రూ. 75,000 ఉండగా, దానిని రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉంది.
అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను సుమారు “40% నుండి 60%” వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ విలువ పెంపుతో పాటు, ప్రస్తుతం ఉన్న 7.5% స్టాంప్ డ్యూటీని స్వల్పంగా తగ్గించి 7%కి తీసుకురావాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను లెక్కించాలని మరియు రియల్ ఎస్టేట్ రంగానికి నష్టం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే తుది ధరలను ఖరారు చేస్తారు.





