
ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది జీవితాలను కేసీఆర్ నాశనం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. దీనివెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు సంజయ్.
అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు అని మండిపడ్డారు. బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేశాడని..రేవంత్ రెడ్డి, ఉత్తంతో పాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
అనుమానం పుట్టినంకే కేసీఆర్ పుట్టారని… అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంజయ్ ధ్వజమెత్తారు.కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీ రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చినా కేసీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.మీ ఇద్దరి మధ్యనున్న రహస్య ఒప్పందమేంటో చెప్పాలన్నారు బండి సంజయ్.
సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని మేం ఫోన్లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అన్నారు బండి సంజయ్.ప్రభాకర్ రావుకు రాచ మర్యాదలు ఇవ్వడం ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని నేను 100 సార్లు చెప్పిన.. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి నేను నైట్ డ్రస్ తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్లో మాట్లాడుతుంటే స్వయంగా విన్నానన్నారు బండి సంజయ్. వాట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని.. అందుకే కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులివ్వడం లేదని ఆరోపించారు బండి సంజయ్. ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా?..కేటీఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారు కదా అన్నారు.ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు మేం సిద్ధమన్నారు. కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశం లేదు కాబట్టే ఆగుతున్నామన్నారు. లేకుంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లమన్నారు బండి సంజయ్.