
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : రాజేంద్రనగర్ బుడ్వేల్ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. వరంగల్కు చెందిన సాయి కార్తీక్ అనే యువకుడిని, పులివెందులకు చెందిన అతని స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… సిద్ధార్థ్ రెడ్డి వద్ద సాయి కార్తీక్ రూ. 8 లక్షల అప్పుగా తీసుకున్నాడు. అయితే డబ్బు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. డబ్బు అడిగినప్పుడల్లా కార్తీక్ తీవ్రంగా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి రూంలో ముగ్గురు స్నేహితులు కలసి మద్యం సేవించగా, మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా మారింది. కోపంతో ఒక్కసారిగా సిద్ధార్థ్ రెడ్డి కార్తీక్పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు, పోలీసులు తెలిపారు. సాయి కార్తీక్ ప్రస్తుతం రాజేంద్రనగర్ బుడ్వేల్లో నివాసం ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.