క్రైమ్ మిర్రర్, జగిత్యాల:- జగిత్యాల జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి పర్వదినం రోజే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ నిండు ప్రాణం బలయ్యింది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి, అదే మండలానికి చెందిన ఓ మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు విశ్వనాథ్ పై కక్ష పెంచుకున్నట్లు సమాచారం.
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
ఆదివారం (ఫిబ్రవరి 15) మహా శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్ గుడికి వెళ్తుండగా.. జగిత్యాల పట్టణ శివారులోని సాయిబాబా బైపాస్ (కరీంనగర్ డెయిరీ సమీపంలో) వద్ద ప్రత్యర్థులు కాపు కాశారు. ఆటోలో వెళ్తున్న విశ్వనాథ్ ను అడ్డగించి, నడిరోడ్డుపైనే కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన విశ్వనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
